న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు మామూలే. పలానాది ఉచితంగా ఇస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతాయి. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్ధానాలపై మార్గదర్శకాలను రూపొందించాలని తమ నోటీసుల్లో సుప్రీం పేర్కొన్నది. రెగ్యుల్ బడ్జెట్ కన్నా.. ఉచిత బడ్జెట్ హద్దులు దాటుతోందని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించింది. జస్టిస్ ఏఎస్ బొప్పన్న, జస్టిస్ హిమా కోహ్లీలు కూడా ఈ బెంచ్లో ఉన్నారు. ఉచిత వాగ్ధానాల అంశంపై గైడ్లైన్స్ను రూపొందించాలని ఇప్పటికే ఈసీని కోరినట్లు సీజే తెలిపారు. కానీ మా ఆదేశాల తర్వాత ఈసీ ఒకేసారి ఈ అంశంపై భేటీ అయ్యిందని, రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఈసీ కోరిందని, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తమకు తెలియదని రమణ తెలిపారు. ఉచిత వాగ్ధానాలు ఇచ్చి నేరవేర్చని పార్టీల గుర్తులను సీజ్ చేయాలని, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని పిల్లో కోరారు.