Supreme Court | సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాకు సుప్రీం జడ్జీలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే.
ఈ ఐదుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత ఏడాది డిసెంబర్ 13న సిఫారసు చేయగా.. కేంద్రం దాదాపు రెండు నెలలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా వీరు ఐదుగురు సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది.
కొత్త న్యాయమూర్తులు వీరే..
జస్టిస్ పీవీ సంజయ్కుమార్
1963, ఆగస్టు 14న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతమ్మ, రామచంద్రారెడ్డి. వీరిది కడప జిల్లా, అయితే సంజయ్కుమార్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నిజాం కాలేజీలో కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పి రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా 1969-82 మధ్య పనిచేశారు. సంజయ్కుమార్ 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్నారు. 2000-03 మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన.. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ సంజయ్కుమార్, 2021, ఫిబ్రవరిలో మణిపూర్ హైకోర్టు సీజే అయ్యారు.
జస్టిస్ పంకజ్ మిత్తల్
1982లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన జస్టిస్ పంకజ్ మిత్తల్.. మీరట్లో ఎల్ఎల్బీ చేశారు. 1985 నుంచి అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2021, జనవరిలో జమ్ముకశ్మీర్ సీజేగా పదోన్నతి పొందారు.
జస్టిస్ సంజయ్ కరోల్
పాట్నా హైకోర్టు సీజేగా 2019, నవంబర్లో నియమితులయ్యారు. అంతకుముందు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. త్రిపుర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పాట్రాన్-ఇన్-చీఫ్గా, త్రిపుర జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్గా విధులు నిర్వర్తించారు.
జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా
పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా 2011లో నియామకం పొందారు. ఆ తర్వాత 2021లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు.. మళ్లీ 2022, జూన్లో పాట్నా హైకోర్టు బదిలీ అయ్యారు. 1963, మే 11న జన్మించిన జస్టిస్ అమనుల్లా.. 1991లో బీహార్ స్టేట్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొన్నారు.
జస్టిస్ మనోజ్ మిశ్రా
అలహాబాద్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2011లో అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జీగా పదోన్నతి పొందారు. 2013లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.