దేశంలో వైద్యులకు తీవ్ర కొరత
మీ నిర్వాకంతో ఖాళీగా 1,456 పీజీ సీట్లు
కేంద్రం, ఎంసీసీలపై సుప్రీం ఆగ్రహం
నేడు కారణాలు తెలపాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 8: నీట్ పీజీ సీట్ల భర్తీ విషయంలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నవేళ 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఎంసీసీ నిర్లక్ష్య వైఖరి కేవలం విద్యార్థుల భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపించడమే కాకుండా దేశంలో వైద్యుల కొరతకు కారణం అవుతుందని పేర్కొన్నది. సీట్లను భర్తీ చేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ బుధవారం సాయంత్రంలోగా అఫిడవిట్ను సమర్పించాలని ఆదేశించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. నీట్ పీజీ కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 1,456 సీట్ల భర్తీకి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఒక్క సీటు కూడా మిగలొద్దు
విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఎంసీసీ తీరును తప్పు పట్టింది. ‘ఒక్క సీటు కూడా మిగిలిపోకుండాచూడాల్సిన, ఒక్క సీటు ఖాళీగా ఉన్నా భర్తీ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశంలో వైద్యుల కొరత ఉన్నవేళ మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచి మనం సాధించేదేమిటి? ఈ చర్య అవినీతిని ప్రోత్సహిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. అర్హత ఉండీ అడ్మిషన్లు నిరాకరించిన పిల్లలకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. నీట్ అడ్మిషన్లకు ఇంచార్జి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) గురువారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్ వాదించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. కోర్టు దీన్ని తిరస్కరించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, వాయిదా వేయలేమని స్పష్టం చేసింది.