Supreme Court : రాష్ట్రాలు ప్రతి కుక్క కాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో పెరిగిపోతున్న కుక్కకాటు ఘటనలపై విచారణను కోర్టు మంగళవారం కొనసాగించింది. కుక్కకాటు ఘటనల నివారణకు రాష్ట్రాలు (States) ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చీవాట్లు పెట్టింది.
ఇలాగే కొనసాగితే ప్రతి కుక్క కాటుకు రాష్ట్రాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తదని పేర్కొంది. కుక్కకాటుతో గాయమైందా, మరణం సంభవించిందా..? బాధితులు పిల్లలా, వృద్ధులా అనే వాటితో సంబంధం లేకుండా తాము ప్రతి కుక్కకాటు ఘటనకు రాష్ట్రాలు భారీగా పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. కుక్కలకు ఆహారం పెట్టే వాళ్లు కూడా ఈ ఘటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది.
కుక్క కాటు ఘటనలపై విచారణ కోర్టు ప్రక్రియలా కొనసాగడం లేదని, కోర్టు ఒక ప్రజా వేదికలా మారిపోయిందని జస్టిస్ విక్రమ్ నాథ్ వ్యాఖ్యానించారు. ‘కుక్కకాటు ఘటనల నివారణకు రాష్ట్రాలు, కేంద్రపాలి ప్రాంతాల దగ్గర ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందో లేదో తెలుసుకోవడానికి తాము ఒకపూట సమయం కేటాయించాల్సి వస్తది. మేం చట్టబద్ధమైన నియమాల అమలును మాత్రమే చూస్తాం. మమ్మల్ని ఆ పని చేయనివ్వండి. ఇది కోర్టు విచారణగా కంటే బహిరంగ వేదికగా మారింది. ప్రతి కుక్కకాటుకు, ప్రతి కుక్కకాటు మరణానికి మేం రాష్ట్రాలపై భారీగా పరిహార భారం వేసే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు కుక్కకాట్ల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు కుక్కకాటు ఘటనలకు బాధ్యులే’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
వీధి కుక్కల అంశం భావోద్వేగాలతో కూడుకున్న అంశమని అడ్వకేట్ మనేకా గురుస్వామి వ్యాఖ్యానించడంపై కోర్టు పైవిధంగా స్పందించింది. అంతేగాక ‘చాలాకాలంగా భావోద్వేగాలు కుక్కల కోసం మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది’ అని కోర్టు వ్యంగ్యంగా పేర్కొన్నది. దాంతో.. విషయం అది కాదని, తాను మనుషుల గురించి కూడా అంతే ఆందోళన చెందుతానని మనేకా స్పందించారు. అందుకు మళ్లీ కోర్టు స్పందిస్తూ.. ‘అయితే మంచిది. ఓ పని చేయండి. కుక్కలను మీ ఇంట్లో పెట్టుకోండి’ అని ఒకింత కోపంతో చెప్పింది.
కాగా కుక్కకాటు ఘటనలపై గత విచారణ జనవరి 9న జరిగింది. దేశంలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోతుండటంపై కోర్టు తొలిసారి గత ఏడాది నవంబర్ 7న స్పందించింది. ప్రభుత్వం సంస్థ దగ్గరి నుంచి కుక్కలను తీసుకెళ్లి ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని అప్పట్లో ఆదేశించింది.