Supreme Court | విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు స్టేషనరీ, లీగల్ ఫీజులు కూడా వృథా అయ్యాయని విచారం వెలిబుచ్చింది. పిటిషన్ దాఖలు చేసిన ఈడీ అధికారికి రూ.లక్ష జరిమానా విధించింది. అతడి జీతం నుంచి రికవరీ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. క్యాన్సర్తో బాధపడుతున్న ఓ నిందితుడికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను శనివారం సుప్రీంకోర్టు విచారించి ఈ మేరకు ఈడీపై
కోపం ప్రదర్శించింది.
క్యాన్సర్ బాధితుడిగా ఉన్న నిందితుడు ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు. దాదాపు రూ. 24 కోట్ల మేర మోసం చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేశారు. గత ఏడాది నవంబర్ 12 న అలహాబాద్ హైకోర్టుకు పిటిషన్ రాగా.. ఆయన చికిత్స తీసుకున్న కమలా నెహ్రూ దవాఖాన హెల్త్ రిపోర్ట్ ఆధారంగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి.. పరిస్థితులను బట్టి నిందితుడు క్యాన్సర్తో బాధపడుతున్నందున ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసిన ఈడీ అధికారికి రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ సొమ్మును నెల రోజుల్లోగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ జరిమానాలో సగం మొత్తం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి అందజేయనున్నట్లు కోర్టు పేర్కొన్నది. మిగిలిన మొత్తాన్ని సుప్రీంకోర్టు ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీకి అందజేయనున్నారు.