న్యూఢిల్లీ, నవంబర్ 7: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణంగా ఉన్న పంట వ్యర్థాల దహనాన్ని వెంటనే ఆపాలని ఢిల్లీ పొరుగు రాష్ర్టాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ సుధాంశ్ ధులియా ధర్మాసనం ఆదేశించింది. ‘వెంటనే ఇది ఆగాలి. అందుకు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. పంట వ్యర్థాల దహనాన్ని ఆపడం మీ విధి’ అని పేర్కొన్నది.
కాలుష్యంపై ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అన్ని సమయాల్లో రాజకీయ యుద్ధం ఉండకూదని సూచించింది. ‘ఈ పంట వ్యర్థాల దహనం ఆగడం లేదు. దీన్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకొన్నాయి’ అని ప్రశ్నించింది. కాలుష్యం కారణంగా ప్రజలు చనిపోనివ్వకూడదని అభిప్రాయపడింది. ఏండ్లుగా కాలుష్య సమస్య ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు పరిష్కారాన్ని గుర్తించలేదని ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు పలు కీలకమైన సూచనలు చేసింది. మున్సిపాలిటీ పరిధిలో ఘన వ్యర్ధాలను బహిరంగంగా తగులబెట్టడాన్ని నియంత్రించాలని సూచించింది.
పంట వ్యర్థాల దహనం ఒక్కటే ఢిల్లీలో ఈ ఏడాది కాలుష్య పెరుగుదలకు కారణం కాదని తాజా నివేదిక పేర్కొన్నది. స్థానికంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు వంటి స్థానిక అంశాలు ఇప్పటికే ఢిల్లీ గాలిని విషపూరితం చేశాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) తెలిపింది. ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం గతం కంటే తగ్గిందని, ఢిల్లీ పీఎం 2.5 స్థాయిల్లో ఇది దాదాపు 25 శాతంగా మాత్రమే ఉన్నదని సీఎస్ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమిత రాయ్ పేర్కొన్నారు.