న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (Public Interest Litigation-PIL) సుప్రీంకోర్టు (Suprem Court ) తోసిపుచ్చింది. ప్రధాని మోదీకి బదులుగా రాష్ట్రపతి ముర్మే పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ఆదేశించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించింది. దాంతో రేపు (28th May) ప్రధాని మోదీ చేతుల మీదుగా నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతున్నది.
నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం రోజున సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు వేశారు. ఈ నెల 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా లోక్సభ సచివాలయం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆ న్యాయవాది తన పిటిషన్లో పేర్కొన్నారు. లోక్సభ సచివాలయం వెలువరించిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ ప్రకటనను ‘చట్ట విరుద్ధం, ఏక పక్షం, అన్యాయం, అధికార దుర్వినియోగం, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం’ అని ఆ పిల్ ఆక్షేపించింది.
‘కొత్త పార్లమెంట్ను రాష్ట్రపతి ఎందుకు ప్రారంభించకూడదు..?’
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధమవడంతో కేంద్రంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. వందే భారత్ రైలు మొదలుకొని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వరకు అన్నింటినీ ప్రధాని మోదీనే ప్రారంభించాలనుకోవడం పాలకుల అభద్రతా భావాన్ని సూచిస్తున్నదని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వనం, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఈ విషయంలో ప్రధానిది తలబిరుసుతనమని, కేంద్ర ప్రభుత్వానిది మొండి వైఖరని విమర్శించారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి చేత ఎందుకు చేయించకూడదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రశ్నించారు. పార్లమెంట్ భారత రిపబ్లిక్ను ప్రతిబింబిస్తుందని, అలాంటి పార్లమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి లేకపోవడం మన గణతంత్ర విలువలను తగ్గిస్తుందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. ‘కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని మోదీ దూరదృష్టిని సూచిస్తున్నదని అమిత్ షా చెప్పడం మంచిదే.. కానీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళా రెజ్లర్ల ఆవేదన, ఆరోగ్యం, విద్యలో వెనుకబాటుతనం లాంటి సమస్యలపైన ప్రధానికి దూరదృష్టి లేదా..?’ అని ఆయన ప్రశ్నించారు.