న్యూఢిల్లీ: గతనెల 12న జరిగిన నీట్-యూజీ ప్రవేశపరీక్షను రద్దుచేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పరీక్ష న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరుగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. లక్షలమంది భవిష్యత్తును పణం గా పెట్టి ప్రవేశపరీక్షను రద్దు చేయలేమని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీ ఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇద్దరు-ముగ్గురు వ్యక్తులు అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ కేసులు దాఖలయ్యాయనే కారణంతో ఇలాంటి రిట్ వేయడం ఏమిటని న్యాయమూర్తి నాగేశ్వరరావు పిటిషనర్ సలోనీ (20) తరఫు న్యాయవాదిని మందలించారు. ఇలాంటి రిట్లు వేస్తే ఖర్చులు వసూలు చేస్తారని ఆమెకు చెప్పలేదా? అని నిలదీశారు.