Supreme Court : భారీ సంఖ్యలో చెట్లను నరకడం ఒక మనిషిని చంపడం కంటే ఏమాత్రం తీసిపోని నేరమని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) వ్యాఖ్యానించింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తాజ్ ట్రెపీజియం జోన్ (Taj trapezium zone) లో ఏకంగా 454 చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంలో మధురకు చెందిన దాల్మియా ఫార్మ్స్ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది.
కొట్టేసిన చెట్ల స్థానంలో తిరిగి పచ్చదనం నెలకొల్పాలంటే కనీసం వందేళ్లు పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్యావరణానికి హాని కలిగించే వారి విషయంలో ఎలాంటి జాలి, దయ చూపాల్సిన అవసరం లేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. చెట్ల నరికివేతకు పాల్పడిన దాల్మియా ఫార్మ్స్ యజమానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. నరికివేసిన 454 చెట్లకుగాను ఒక్కో చెట్టుకు లక్ష రూపాయల చొప్పున ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది.
అదేవిధంగా తాజ్ ట్రెపీజియం జోన్ సమీపంలో మొక్కల పెంపకం చేపట్టాలని నిందితుడిని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 2019లో ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు గుర్తుచేసింది. తాజ్ ట్రెపీజియం జోన్ పరిధిలో అటవీ ప్రాంతం కానిచోట, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని తీర్పు సందర్భంగా గుర్తుచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.