న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పిన ధర్మాసనం.. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను పరిశీలించడంలో న్యాయపరిధి చాలా పరిమితంగా ఉందని తెలిపింది. ఏదైనా పథకం బాగుంది, బాగలేదు అని చెప్పే అధికారం కోర్టుకు లేదని పేర్కొంది.
ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ కచ్చితత్వం, అనుకూలత, సముచితత్వాన్ని పరిశీలించలేమని, అదేవిధంగా నిర్దిష్ట విధానాన్ని లేదా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించలేమని తెలిపింది. NFSA లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు అనే భావన రాష్ట్రాల ముందు ఉన్న ఉత్తమమైన మార్గమా.. కాదా..? అనే విషయాన్ని కూడా తాము పరిశీలించలేమని తెలిపింది. బదులుగా వేరే సంక్షేమ పథకాలు అమలు చేయాలనే సూచనలు ఇస్తామని కోర్టు వ్యాఖ్యానించింది.
ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆకలి, పోషకాహార లోపం కారణంగా ప్రతిరోజు ఐదేండ్ల కంటే తక్కువ వయస్సున్న చాలా మంది పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పిల్లల జీవించే హక్కుతో సహా వివిధ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు వాదించారు.