న్యూఢిల్లీ, జూలై 30: కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఓ డాక్టర్ లైసెన్స్ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, ఆ వైద్యుడి ‘డాక్టర్ లైసెన్స్’ను తిరిగి పునరుద్ధరించాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తీర్పునిచ్చింది.
కోర్టు ధిక్కరణ ఏ స్థాయిలో ఉంది, దాని తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ‘కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయబద్ధంగా ఆలోచించాలి’ అని పేర్కొన్నది. అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని కోర్టు జారీ చేసిన ఆదేశాలు అమలు చేయనందుకు, జరిమానాగా సదరు డాక్టర్ లైసెన్స్ను హైకోర్టు రద్దు చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.