న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహంపై వివిధ హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టకు ట్రాన్స్ఫర్ చేయాలని ఇవాళ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇవాళ ఈ కేసులో విచారణ చేపట్టింది. ఢిల్లీ, కేరళ, గుజరాత్ హైకోర్టుల్లో సేమ్ సెక్స్ మ్యారేజ్పై పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయాలని, ఈ కోర్టే వాటిపై నిర్ణయం తీసుకుంటుందని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. స్వలింగ సంపర్కుల అంశంపై ఆరు వారాల్లోగా సంబంధిత పిటిషన్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పర్దివాలాలు ఉన్నారు.