చెన్నై, మార్చి 25: న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు దక్కటం లేదని, కుటుంబ బాధ్యతలు సాకుగా చూపి మహిళలను దూరం చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వృత్తిలో మహిళల సంఖ్య నామమాత్రంగా ఉన్నదని, సమాన అవకాశాలు దక్కకపోవటమే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం తమిళనాడులోని మయిలదుత్తురైలో కోర్టు భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువ మహిళా న్యాయవాదుల్లో నైపుణ్యానికి కొదవలేదని చెప్పారు. ‘జిల్లా న్యాయవ్యవస్థల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతున్నది. ఎంపికవుతున్నవారిలో 50శాతానికిపైగా మహిళలే ఉంటున్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉన్నది’ అని తెలిపారు.
కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ జరుగుతున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టి పారేశారు. ప్రజాస్వామ్యంలో విభేదాలు అనివార్యమని, కానీ వాటిని ఘర్షణగా చూపకూడదని అన్నారు. దేశంలోని వివిధ శాఖల మధ్య ఎలాంటి సమస్య లేదనే విషయాన్ని తాను స్పష్టం చేస్తున్నానని రిజిజు ఈ సందర్భంగా అన్నారు. కోర్టుల్లో కేసుల పరిష్కారం త్వరగా జరగాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజా హాజరయ్యారు.