Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నిక విషయంలో నెలకొన్న వివాదంపై మంగళవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మాషి ‘X’ మార్కు గీసి చెల్లనివిగా ప్రకటించిన ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో వేసి ఓట్లను మళ్లీ లెక్కించాలని చండీగఢ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వివాదంపై విచారణ జరిపింది.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. రిటర్నింగ్ అధికారి అనిల్ మాషి చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లను పరిశీలించారు. ఆ 8 ఓట్లు ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు పడినట్లు గుర్తించారు. అనంతరం అనిల్ మాషిపై సీరియస్ అయ్యారు. బ్యాలెట్ పేపర్పై ‘X’ మార్క్ గీసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆప్ అభ్యర్థి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా అనిల్ మాషి తీరును తప్పుపట్టారు. అతను చేసింది తీవ్రమైన నేరమని వ్యాఖ్యానించారు.
కాగా, గత నెల 30 చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాషి పక్షపాత వైఖరితో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు. బీజేపీకి తక్కువ ఓట్లు రావడంతో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు పడిన 8 ఓట్లపై ‘X’ మార్కు గీసి వాటిని చెల్లనివిగా ప్రకటించారు. మిగిలిన ఓట్లను లెక్కించి బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన చేశారు. దాంతో బీజేపీ అభ్యర్థి మేయర్గా ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఆప్ అభ్యర్థి కోర్టుకు వెళ్లడంతో.. విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పు వెల్లడించింది.