Manipur Violence | న్యూఢిల్లీ: ‘మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆమోదయోగ్యం కాదు. హింసకు పాల్పడేందుకు మహిళలను సాధనాలుగా వాడుకోవడం ఆమోదనీయం కాదు. మీకు కొంత సమయం ఇస్తున్నాం. ఆలోపు వారిపై చర్యలు తీసుకోండి. లేదా మీ వల్ల కాదంటే చెప్పండి.. మేం చూసుకుంటాం’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది.
మణిపూర్ అంశంపై మౌనంగా ఉన్న కేంద్రప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మణిపూర్ అల్లర్ల మాటున మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన వీడియో వైరల్గా మారడంతో సుప్రీంకోర్టు దీనిపై గురువారం విచారించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. మణిపూర్లో జరుగుతున్న దారుణాలపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.
రాజ్యాంగ, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని మండిపడింది. ‘రెండు నెలలుగా జరుగుతున్న హింసాకాండపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఒకటేనా? లేదా ఇంకా జరిగాయా? లేదా ఇది ఒక నమూనానా? అని ప్రశ్నించింది. ఈనెల 28న తదుపరి విచారణ ఉంటుందని, ఆలోపు మణిపూర్పై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.