Supreme Court : రాజకీయ కురువృద్ధుడు శరద్పవార్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఆయన వర్గం ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్చంద్ర పవార్’ (NCP-Sharad Chandra Pawar) పేరుతో, ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తుపై లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుప్రీంకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ‘మనిషి ఊదుతున్న తురాయి’ గుర్తును శరద్ పవార్ వర్గానికి రిజర్వ్ చేయాలని, మరే పార్టీకి, అభ్యర్థికి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
అదేవిధంగా అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసలు గుర్తు అయిన ‘గడియారం’ గుర్తుపై పోటీ చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అజిత్పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘం చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శరద్ పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్పై తమ తీర్పు వచ్చే వరకు తాజా ఆదేశాలు వర్తిస్తాయని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో శరద్ పవార్ వర్గానికి ఊరట లభించినట్లయ్యింది.
కాగా, శరద్ పవార్ స్థాపించిన NCPని గత ఏడాది జూలైలో అజిత్ పవార్ చీల్చారు. మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలసి ఆయన ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. దాంతో శరద్పవార్ వర్గం తమ పార్టీ లోగో, గుర్తును అజిత్ పవార్ వర్గం వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరింది. అటు అజిల్ పవార్ వర్గం తమదే అసలైన ఎన్సీపీ అని, ఎక్కువ మంది మద్దతు తమకే ఉన్నందున తమదే అసలైన ఎన్సీపీగా ప్రకటించాలని కోరింది.
దాంతో కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ గత నెలలో ప్రకటన చేసింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శరద్పవార్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉండగానే ఎన్నికల వచ్చాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్ పార్టీ పేరుతో, తురాయి ఊదుతున్న మనిషి గుర్తుతో తాము పోటీపడేందుకు అనుమతించాలంటూ శరద్పవార్ వర్గం చేసిన అభ్యర్థన మేరకు కోర్టు అనుమతి తెలిపింది.