Sensational judgment | సామూహిక లైంగికదాడి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చావ్లా కేసులో ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. నిర్దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుపై బాధితురాలి తండ్రి విచారం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మా 10 ఏండ్ల పోరాటాన్ని పట్టించుకోలేదని, న్యాయం జరిగేంత వరకు పోరాడుతానన్నారు. కాగా, ఈ లైంగికదాడి, హత్య జరిగిన 10 నెలల తర్వాత 2012 డిసెంబర్ 16 న నిర్భయ కేసు నమోదైంది.
ఉత్తరాఖండ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు రవి, రాహుల్, వినోద్.. 2012 ఫిబ్రవరి 9 న ఢిల్లీలోని చావ్లా ప్రాంతంలో ఓ 19 ఏండ్ల యువతిపై సామూహిక లైంగికదాడి జరిపారు. ఐదు రోజుల అనంతరం దారుణ హత్యకు గురైన ఆమె మృతదేహాన్ని హర్యానాలోని రేవారి పొలాల్లో పోలీసులు గుర్తించారు. గుర్తించకుండా ఉండేందుకు నిందితులు మృతదేహానికి నిప్పు పెట్టారు. కేసును విచారించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసును విచారించిన ట్రయల్ కోర్టు 2014 లో వీరికి మరణశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధిస్తూ.. వీధుల్లో వేటాడే హింసాత్మక జంతువులు వీరు అంటూ తీవ్రమైన వ్యాఖ్య చేసింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై విధించిన శిక్షను తగ్గించాలని విన్నవించారు. కేసును విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం.. సంచలన తీర్పునిచ్చింది. ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను వెనక్కి తీసుకుని ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. శిక్ష అనేది భావోద్వేగాలపై ఆధారపడి ఉండదు. మేము మీ భావాలను అర్థం చేసుకుంటున్నాం. కానీ, భావాల ఆధారంగా కోర్టు నిర్ణయాలు తీసుకోవు..’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.