న్యూఢిల్లీ, మే 8 (నమస్తే తెలంగాణ): డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. ఇందులో భాగంగా రెజ్లర్ల పోరాటానికి సంఘీభావం ప్రకటించేందుకు వస్తున్న రైతులను కట్టడి చేసేందుకు కేంద్రం ఉపక్రమించింది. సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఉన్న రెజ్లర్ల దీక్షాస్థలికి పలు రాష్ర్టాల నుంచి వచ్చిన వందల మంది రైతులను నిలువరించేందుకు ఢిల్లీ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు.
బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పలువిధాలుగా అడ్డంకులు సృష్టించారు. దీంతో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటంలో కూడా ఇదేవిధంగా వ్యవహరించిన సర్కార్ తీరుపై రైతుల్లో మరోసారి ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. రెజ్లర్ల ఆందోళన వేదిక వద్దకు వెళ్లనీయకుండా పెట్టిన బారికేడ్లను పక్కకు ఈడ్చిపారేశారు. మరికొంత మంది వాటిని తోసుకొంటూ, తొక్కుకొంటూ దీక్షా శిబిరం వద్దకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, రైతులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించేందుకు వస్తే పోలీసులు ఒకవైపు నుంచే రావాలని అన్నారని, అయితే అక్కడ అంత స్థలం లేదని ఓ రైతు పేర్కొన్నారు. అయితే రైతుల ప్రవేశానికి వీలుగా బారికేడ్లు, భద్రత కోసం మెటల్ డిటెక్టర్ ఎంట్రీ ఏర్పాటు చేశామని పోలీసులు చెప్పుకొచ్చారు.
బ్రిజ్భూషణ్పై చర్యలు తీసుకోనేంత వరకు, తమకు న్యాయం జరిగే వరకు జంతర్మంతర్ వద్ద నుంచి కదిలేది లేదని రెజ్లర్లు స్పష్టం చేస్తున్నారు. రెజ్లర్లు, వారి మద్దతుదారులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 21లోగా బ్రిజ్భూషణ్ను అరెస్టు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర నిర్ణయం తీసుకొంటామని వినేశ్ ఫొగట్ హెచ్చరించారు. కొనసాగుతున్న నిరసనల మధ్య తమ కుస్తీ భవిష్యత్తుపై మాట్లాడుతూ ‘దేవుడు తమకు అవకాశం కల్పిస్తే, తప్పకుండా పోటీ పడి ఆడుతాం. ఓవైపు ఆందోళనలు చేస్తూనే సాధ్యమైనంత వరకు శిక్షణ తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. శిక్షణ కోసం కొంత సమయం వెచ్చించేందుకు, ట్రైనింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు ఎస్కేఎం మద్దతుపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. రైతు నేతలు ‘తప్పు చేయవద్దు’ అంటూ ఉపదేశాలు ఇచ్చారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు వేచిచూడాలని అన్నారు. తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. సెలెక్షన్ ప్రక్రియలో పలు మార్పులు తీసుకొచ్చినందునే తనను రెజ్లర్లు టార్గెట్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.