చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ సీఎం అభ్యర్ధిగా చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ప్రకటించడాన్ని జాఖఢ్ తప్పుపట్టారు. చన్నీ అభ్యర్ధిత్వాన్ని మహిళా నేత ప్రతిపాదించిన విషయం ప్రస్తావిస్తూ ఆయన పార్టీకి ఆస్తి లాంటి వాడని చేసిన వ్యాఖలను ఎద్దేవా చేశారు. చన్నీ పార్టీకి ఆస్తి కాదని..మోయలేని రుణభారమని వ్యాఖ్యానించారు. చన్నీని జాతి సంపదగా ప్రకటించనందుకు ధన్యవాదాలని సెటైర్లు విసిరారు.
చన్నీ స్వార్ధమే ఆయనను, పార్టీని నాశనం చేసిందని ఆరోపించారు. చన్నీ మేనల్లుడి నుంచి ఈడీ రూ 10 కోట్లు స్వాధీనం చేసుకుందన్న న్యూస్ క్లిప్పింగ్ను జోడిస్తూ జాఖడ్ సోమవారం ట్వీట్ చేశారు. ఇక పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా చన్నీ పేరును పిబ్రవరి 6న లూధియానాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే రోజున పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్ క్రియాశీల ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగారు.
ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చన్నీ పోటీచేసిన చామ్కౌర్ సాహిబ్, భదౌర్ రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోయారు. చన్నీ కనీసం ఒక నియోజకవర్గం నుంచైనా గెలుపొందుతారని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. ఇక మార్చి 10న వెల్లడైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీలను ఊడ్చేసిన ఆప్ అద్భుత విజయం సాధించింది. మార్చి 16న పంజాబ్ సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.