Punjab Polls | పంజాబ్ సీఎం అభ్యర్థి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. అలాగే అధిష్ఠానానికి కూడా పెద్ద తలనొప్పిగా మారుతోంది. అయితే ఆమ్ఆద్మీ లాగానే కాంగ్రెస్ కూడా సీఎం అభ్యర్థి కోసం టెలీ ఓటింగ్ నిర్వహించి, ప్రజాభిప్రాయం ద్వారానే సీఎం అభ్యర్థి ఎంపికను పూర్తి చేయాలని కాంగ్రెస్ ఆలోచనగా కొందరు చెబుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తున్న తరుణంలోనే పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖడ్ అధిష్ఠానంపై సంచలన ఆరోపణలు చేశారు. తాను హిందువు అయిన కారణంగానే సీఎం అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్ఠానం తనను పక్కకు పెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు.
హిందువు అన్న కోణంలోనే తనను సీఎం అభ్యర్థిత్వం విషయంలో తిరస్కరించారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేవలం సిక్కు వర్గానికి చెందిన వ్యక్తినే సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని పేర్కొన్నారు. అధిష్ఠానానికి సలహాలిచ్చే వారు కేవలం సిక్కు వ్యక్తినే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సూచిస్తున్నారని, ఇది తనను షాక్కు గురి చేసిందని అన్నారు. పంజాబ్ సీఎం అభ్యర్థి ఎవరన్నది అధిష్ఠానం అతి త్వరగా తేల్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూర్చున్న సలహాదారులు సరైన సలహాలు ఇవ్వడమే లేదు. నన్ను సీఎం చేయడం లేదని అనడం సరే. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేను. ఎందుకంటే నేను పంజాబీ హిందువును. అందుకే ఇలా చేస్తున్నారు. అంటూ సునీల్ జాఖడ్ ఆరోపించారు.