ముంబై: మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గానికి జరగాల్సిన బైపోల్ ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నది. దీంతో ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్(Sunetra Pawar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎన్సీపీ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిదే. ఈ నేపథ్యంలో బారామతిలో ఏప్రిల్ 23వ తేదీన ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పుకోవడంతో.. సునేత్ర పవార్ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది.
పోటీ నుంచి తప్పుకోవాలని ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రీయా సూలే.. కాంగ్రెస్ పార్టీని వేడుకున్నారు. జనవరిలో జరిగిన విమాన ప్రమాదంలో సునేత్ర పవార్ భర్త అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల తర్వాత డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ కుటుంబానికి బారామతి సీటు కంచుకోట. 1991 నుంచి అజిత్ పవార్ ఆ స్థానం నుంచి విజయం సాధించారు. అంతకన్నా ముందు బారామతి సీటు నుంచి శరద్ పవార్ ప్రాతినిధ్యం వహించారు.
బారామతి ఎంపీగా ప్రస్తుతం సుప్రియా సూలే కొనసాగుతున్నారు. బైపోల్స్ నామినేషన్కు గురువారమే చివరి రోజు. అయితే బారామతి నుంచి తమ పార్టీ అభ్యర్థి అమర్ మోరే పోటీ చేయడం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్దన్ సప్కాల్ తెలిపారు.