చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఇంటిని అతని తల్లిదండ్రులు అమ్మేశారు. మధురైలో లక్ష్మీ, రెఘునాథ పిచాయ్ దంపతులకు జన్మించిన సుందర్ పిచాయ్ తన బాల్యం అంతా తమిళనాడు రాజధాని చెన్నైలోనే గడిపారు. చెన్నై అశోక్ నగర్ ఏరియాలోని ఇంట్లోనే పిచాయ్కి 20 ఏండ్లు వచ్చేవరకు అతని కుటుంబం నివాసం ఉన్నది. అయితే ఇటీవల పిచాయ్ తల్లిదండ్రులు ఆ ఇంటిని కూల్చేసి స్థలాన్ని అమ్మకానికి పెట్టారు.
ఆ ఇంటిని కొన్నది కూడా ఎవరో కాదు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత మణికందన్. పిచాయ్ పూర్వీకుల ఇంటిని కొనుగోలు చేసిన మణికందన్.. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లను తన చేతిలో పెడుతూ పిచాయ్ పేరెంట్స్ కంటతడి పెట్టిన విషయాన్ని వెల్లడించారు. ఇంటి డాక్యుమెంట్స్ కోసం తాను పిచాయ్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన తల్లి లక్ష్మి తనకు ఫిల్టర్ కాఫీ చేసి ఇచ్చారని, ఆ తర్వాత డాక్యుమెంట్స్ తన చేతిలో పెడుతూ రెఘునాథ పిచాయ్ కంటతడి పెట్టారని, అది చూసి లక్ష్మి కూడా ఏడ్చేశారని మణికందన్ తెలిపారు.
కాగా, ఇల్లు కొనుగోలు ప్రక్రియ మొదలైనప్పుడు సుందర్ పిచాయ్ తండ్రి అమెరికాలో ఉండటంతో ప్రాసెస్ పూర్తికావడానికి నాలుగు నెలల సమయం పట్టిందని మణికందన్ చెప్పారు. తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్న సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఇంటిని కొనుగోలు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సుందర్ పిచాయ్ ఆఖరిసారి 2021లో ఆ ఇంటికి వచ్చినట్లు ఆయన పేరెంట్స్ చెప్పారని మణికందన్ తెలిపారు.