న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపుపై ఇవాళ రాజ్యసభలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటన చేశారు. తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొన్నా.. తమ ప్రభుత్వం అత్యంత విజయవంతంగా 22,500 మంది విద్యార్థులు స్వదేశానికి తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు.
విద్యార్థుల తరలింపు కోసం ఆపరేషన్ గంగా చేపట్టామన్నారు. ఆపరేషన్ గంగ కింద 90 ఫ్లయిట్లను ఆపరేట్ చేశామన్నారు. రొమేనియా, పోలాండ్, హంగేరి, స్లోవేనియా నుంచి ఆ విమానాలు నడిచినట్లు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ పలుసార్లు మాట్లాడారన్నారు. ఈయూ దేశాల ప్రధానులతోనూ మోదీ మాట్లాడరని, విద్యార్థుల తరలింపులో సహకరించిన దేశాలకు థ్యాంక్స్ చెప్పినట్లు తెలిపారు.
విదేశాంగ శాఖ కార్యదర్శి అనునిత్యం ఉక్రెయిన్, రష్యా రాయబారులతో టచ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర మంత్రులు ఈయూ దేశాలకు వెళ్లడం వల్లే.. విద్యార్థుల తరలింపు చాలా సులువైందన్నారు. ఉక్రెయిన్లో బస్సులు, రైళ్లతో ఇండియన్ విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. ఖార్కివ్ నుంచి అనేక మంది విద్యార్థుల్ని చాలా విపత్కర పరిస్థితుల నుంచి తరలించినట్లు తెలిపారు. సుమీ నగరం నుంచి తరలింపు కూడా అత్యంత క్లిష్టంగా సాగిందన్నారు. ప్రధాని మోదీ వ్యక్తిగతంగా రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో చర్చించడం వల్లే విద్యార్థుల తరలింపు సక్సెస్ అయినట్లు మంత్రి జైశంకర్ చెప్పారు.
ఉక్రెయిన్ లో ఉన్న ఎంబసీ .. భారతీయులతో టచ్లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. పాస్పోర్ట్ సమస్యలు రాకుండా ఉక్రెయిన్లోని భారతీయ ఎంబసీ అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన సమయంలో సుమారు 20వేల మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రమాదంలో ఉందన్నారు.
ఖార్కీవ్లో మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప రష్యా దాడిలో చనిపోయినట్లు చెప్పారు. నవీన్ మృతి పట్ల మంత్రి నివాళి అర్పించారు. నవీన్ భౌతికాయాన్ని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బుల్లెట్ గాయాలైన హర్జ్యోత్ సింగ్ కు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారతీయ వైఖరిని చెప్పినట్లు మంత్రి తెలిపారు. సెక్యూర్టీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్ గురించి మాట్లాడామని, అక్కడ కాల్పుల విరమణ పాటించాలని కోరామన్నారు. ఉక్రెయిన్పై దాడి వల్ల ఇంధన ధరలపై నేరుగా ప్రభావం పడిందన్నారు. రెండు దేశాల్లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీకి కూడా మంత్రి థ్యాంక్స్ చెప్పారు. చాలా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నట్లు మంత్రి తెలిపారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం చాలా కాన్ఫెడెన్స్తో ఎదుర్కోనున్నట్లు తెలిపారు.