న్యూఢిల్లీ, జూలై 27: కేంద్రానికి భారీ ఊరట లభించింది. మనీల్యాండరింగ్ చట్టం కింద సమన్లు జారీ చేసే, అరెస్టు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని నిబంధనల కింద అరెస్టు చేసే వ్యక్తికి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఇవ్వడం తప్పనిసరి ఏమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అరెస్టు సమయంలో అందుకు కారణాలు వివరిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ చట్టం కింద బెయిలుకు కఠిన నిబంధనలు పెట్టడం సరైనదేనని, ఇది నిర్హేతుక అధికారం కిందకు రాదని స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన సుమారు 200 పిటిషన్లపై న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈసీఐఆర్ను ఎఫ్ఐఆర్తో పోల్చలేమని.. అది ఈడీ ఆంతరంగిక పత్రమని తెలిపింది. ఈడీ, ఎస్ఎఫ్ఐవో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లాంటి దర్యాప్తు ఏజెన్సీలను పోలీసులతో పోల్చలేమని బెంచ్ పేర్కొన్నది. ఈ కేసు పిటిషనర్లలో అనిల్ దేశ్ముఖ్, కార్తి చిదంబరం, మహబూబా ముఫ్తి వంటి ప్రముఖులు ఉన్నారు. కారణాలు, సాక్ష్యాలు చూపకుండా అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు.