షిమ్లా: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుఖ్విందర్ సింగ్ సుఖు ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముందుగా ఇవాళ ఉదయం 11 గంటలకే ప్రమాణస్వీకారం ఉంటుందని ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలవల్ల మధ్యాహ్నం 1.30 గంటలకు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
కాగా, ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఇవాళ ఉదయం సుఖ్విందర్ సింగ్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరుతూ తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె తన కొడుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పాలన సాగించాలని ఆశీర్వదించారు. అనంతరం హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా వీరభద్ర సింగ్ను సుఖ్విందర్ సింగ్ ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని స్వయంగా ఆమెను ఆహ్వానించారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు పేరును, డిప్యూటీ సీఎంగా ముఖేశ్ అగ్నిహోత్రి పేరును ఖరారు చేసింది. దాంతో శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కేంద్ర పరిశీలకులు రాజీవ్ శుక్లా, భూపేశ్ బఘేల్ ఆధ్వర్యంలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుఖ్విందర్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు సమావేశం అనంతరం బఘేల్ ప్రకటించారు.