జైపూర్, డిసెంబర్ 5: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగామెడీని గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. మంగళవారం మధ్యాహ్నం రాజస్థాన్ జైపూర్లోని శ్యామ్నగర్ ప్రాంతంలో ఉన్న సుఖ్దేవ్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ‘సుఖ్దేవ్తో మాట్లాడేపని ఉందని ముగ్గురు దుండగులు ఆయన ఇంటికి వచ్చారు. సుఖ్దేవ్ సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉండగా.. దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. సుఖ్దేవ్ గన్మెన్పై, అక్కడున్న మరో వ్యక్తిపైనా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు’ అని రాజస్థాన్ డీజీపీ ఉమేశ్ మిశ్రా విలేకరులకు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సుఖ్దేవ్ను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాల్పుల ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. సుఖ్దేవ్ అనుచరులు జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు చనిపోయాడు. మిగతా ఇద్దరు దుండగులు పారిపోగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనతో జైపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాజ్పుత్ సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు దవాఖానకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన సంపత్ నెహ్రా నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సుఖ్దేవ్ సింగ్ గతంలో పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీనిని పోలీసులు పట్టించుకోలేదని సుఖ్దేవ్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రీయ కర్ణిసేనతో సుఖ్దేవ్ సింగ్కు చాలాకాలంగా అనుబంధముంది. అయితే ఆ సంస్థతో కొంతకాలంగా ఏర్పడ్డ విభేదాల కారణంగా రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన పేరుతో మరో సంస్థను ఏర్పాటుచేసుకున్నారు. బాలీవుడ్ చిత్రాలు పద్మావత్, గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ ఎన్కౌంటర్ కేసు తర్వాత రాజస్థాన్లో జరిగిన పలు ధర్నాలతో సుఖ్దేవ్ వార్తల్లో నిలిచారు.