చండీఘఢ్ : పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విస్పష్ట మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపధ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఒపీనియన్ పోల్స్ను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ను పంజాబీలు ఎవరూ నమ్మరని ఆప్ ప్రజాధనంతో ఒపీనియన్ పోల్స్ను నిర్వహిస్తోందని బాదల్ ఆరోపించారు.
పలు ఎగ్జిట్ పోల్స్ పంజాబ్లో ఆప్ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ రెండో స్ధానానికి పరిమితమవుతుందని, బీఎస్పీతో కలిసి బరిలో దిగిన అకాలీదళ్ ఆ తర్వాతి స్దానంలో నిలుస్తుందని అంచనా వేశాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ను పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ తోసిపుచ్చారు. ప్రజలు మార్చి 10 వరకూ ఓపిక పట్టాలని కోరుతూ ఏం జరుగుతుందో కేవలం ఈవీఎంలే వెల్లడిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.
పంజాబ్ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నాయని, గ్రామాల్లో ఆప్ ఉనికి లేదని అలాంటి పార్టీకి ఓట్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్కు అనుకూలంగా పంజాబీల తీర్పు ఉంటుందని అన్నారు. పంజాబ్లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే పూర్తి విశ్వాసం తనకుందని స్పష్టం చేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్లో ఉన్న ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ తమ పార్టీకి 80 స్ధానాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.