న్యూఢిల్లీ : మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత జైలు అధికారులు తనను బెదిరిస్తున్నట్లు ఆరోపించాడు. దీంతో పాటు కుటుంబ సభ్యులకు సైతం పలు ఫోన్ నంబర్ల నుంచి బెదింపులు వస్తున్నట్లు మరో లేఖను విడుదల చేశాడు. తన లాయర్ ద్వారా పంపిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించాడు. అయితే, బీజేపీ ఒత్తిడితో తాను అరవింద్ కేజ్రీవాల్పై ఆరోపణలు చేయలేదని, గతంలో ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని చెప్పాడు.
అలాగే న్యాయ పోరాటం కొనసాగిస్తామని లేఖలో పేర్కొన్నాడు. ఢిల్లీ పౌర సంస్థలు, గుజరాత్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఆప్ చాలా స్వల్ప తేడాతో గెలిచిందని, సత్యేందర్ జైన్ నియోజకవర్గంలో అన్ని సీట్లను ఆప్ కోల్పోయిందని, మనిష్ సిసోడియా నియోజకవర్గంలో సీట్ల సంగతేందని ప్రశ్నించాడు. ఇది కేజ్రీవాల్ రాజకీయాల ముగింపునకు నాంది అని పేర్కొన్నాడు. తాను కేజ్రీవాల్తో సన్నిహితంగా పని చేశానని, ఆయన ఎలా పని చేస్తారో తనకు తెలుసునని సుకేశ్ లేఖలో రాసుకొచ్చాడు. కేజ్రీవాల్ దోపిడీ ముఠాను నడుపుతున్నారని ఆరోపించిన సుకేష్, జైన్ను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించడం లేదని నిలదీశాడు.
అన్ని లావాదేవీల వివరాలకు సంబంధించిన బ్లాక్ అండ్ బ్రౌన్ డెయిరీ సత్యేందర్ జైన్ వద్ద ఉందని ఆరోపించాడు. ఈ సందర్భంగా రెండు ఫోన్ నంబర్లను ప్రస్తావించిన సుకేష్.. ఆ నంబర్ల నుంచి తన కుటుంబానికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పాడు. అలాగే సత్యేందర్ జైన్ తిహార్ జైలులో ఫోన్ వినియోగిస్తున్నాడని ఆరోపించారు. సుకేష్ కేజ్రీవాల్, జైన్ ఇద్దరినీ మహాథగ్స్ అంటూ సంబోధించిన సుకేశ్.. జీకే అలియాస్ జైకిషన్ అనే వ్యక్తి పేరును ప్రస్తావించాడు. జైన్ ఒత్తిడితో జీకే ప్రియురాలి కోసం ముంబయిలోని గోరేగావ్లో రూ.ఏడు కోట్ల విలువైన అపార్ట్మెంట్ కొన్నట్లు పేర్కొన్నాడు. చివరగా అందరినీ భాగోతం బయటపెడతానని సుకేష్ హెచ్చరించాడు.