Suicide : క్షణికావేశంలో ఓ వ్యక్తి తన ప్రాణం తీసుకున్నాడు. భార్యతో గొడవ పెట్టుకుని, ఆమె వారిస్తున్నా వినకుండా తన కళ్ల ముందే కదులుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలోని సవాయ్ మాధోపూర్ జిల్లా (Sawai Madhopur district) లో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. దిల్రాజ్ మీనా అనే 23 ఏళ్ల యువకుడు ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. భార్యాభర్త ఇద్దరూ కోటాలోని బాలాజీకి బాగ్చీ ఏరియాలో ఉంటూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వాట్సాప్ స్టేటస్ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానంటూ దిల్రాజ్ ఇంట్లోంచి పరుగులు తీశాడు.
దాంతో అతడి భార్య కూడా దిల్రాజ్ వెంటే పరుగెత్తుకుంటూ వెళ్లింది. రైల్వే ట్రాక్ వెంట పరుగెడుతున్న భర్తను వారిస్తూ, వద్దూవద్దూ అని గట్టిగా అరుస్తూ అతడిని అనుసరించింది. ఇంతలో ఎదురుగా రైలు రావడంతో ఆమెకు కొన్ని మీటర్ల దూరంలో ఆ రైలు కింద దూకి దిల్రాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.