చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్లోని జలంధర్లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెరుకు రైతులు నిరవధిక నిరసనలకు దిగారు. పంజాబ్ ప్రభుత్వం తమ డిమాండ్లపై సాయంత్రంలోగా చర్చలు జరపకుంటే పంజాబ్ బంద్కు పిలుపు ఇస్తామని రాఖీ పండుగ రోజు బంద్ జరపకూడదని యోచిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇక జలంధర్-పగ్వారా జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో జలంధర్, అమృత్సర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నిరసనల నేపథ్యంలో 50 రైళ్లను రద్దు చేయగా, 54 రైళ్లను దారిమళ్లించినట్టు ఫిరోజ్పూర్ డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు.