Suchana Seth | నాలుగేళ్ల తన కొడుకును అత్యంత దారుణంగా హత్య చేసిన బెంగళూరు సీఈవో సుచనాసేథ్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. ఇటీవల విధించిన ఆరు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో గోవాలోని కాలాంగుటే పీఎస్కు చెందిన పోలీసులు.. ఇవాళ ఆమెను మరోసారి కోర్టులో హాజరుపర్చారు.
నిందితురాలు దర్యాప్తులో సహకరించడంలేదని, ఆమె నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, అదేవిధంగా డీఎన్ఏ శాంపిల్స్ తీసుకోవాల్సి ఉందని, కాబట్టి ఆమె కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని పోలీసులు కోరారు. దాంతో కోర్టు సుచనాసేథ్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది.
కాగా, 39 ఏళ్ల సుచనాసేథ్ బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీకి సీఈవో. ఈ నెల 5న ఆమె గోవాలోని కండోలిమ్ ప్రాంతంలోగల ఓ అపార్టుమెంట్లో తన నాలుగేళ్ల కుమారుడిని హత్యచేసింది. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని ట్యాక్సీలో బెంగళూరుకు బయలుదేరింది.
సమాచారం అందుకున్న గోవా పోలీసులు ఆమెను వెంబడించి ఈ నెల 8న కర్ణాటకలోని చిత్రదుర్గ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవాకు తీసుకెల్లి మపుసా కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ ఆ కస్టడీని మరో ఐదు రోజులపాటు పొడిగించింది.