న్యూఢిల్లీ : టమాటాలు రికార్డు ధర పలుకుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతుండగా ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ కంపెనీ నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్) టమాటాలను కిలో రూ. 70కే (Subsidised Tomatoes) విక్రయిస్తోంది. ఆన్లైన్లో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ద్వారా టమాటాలను విక్రయిస్తోంది.
ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో టమాటాల విక్రయం కోసం తాము ఓఎన్డీసీతో ఒప్పందం చేసుకున్నామని ఎన్సీసీఎఫ్ ఎండీ అనీస్ జోసెఫ్ చంద్ర వెల్లడించారు. ఓఎన్డీసీ ప్లాట్ఫాం ద్వారా వినియోగదారులు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ ఆర్డర్లు ప్లేస్ చేయవచ్చని, ఆపై టమాటాల డెలివరీ మరుసటి రోజు ఉంటుందని తెలిపారు.
వినియోగదారులపై అదనపు భారం పడకుండా వారి ఇండ్ల వద్దే డెలివరీ చేస్తామని ఆమె వెల్లడించారు. టమాటాలు కేవలం రెండు కిలోల వరకే ఆర్డర్ ప్లేస్ చేసేందుకు అనుమతిస్తామని చెప్పారు. ఇక ప్రస్తుతం టమాటాలు కిలో రూ. 170-రూ. 180కు ఈ-కామర్స్ కంపెనీలు డోర్ డెలివరీ చేస్తున్నాయి. టమాటాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రికార్డు ధరలు పలుకుతున్నాయి. కొన్ని నగరాల్లో టమాటాలు కిలోకు ఏకంగా రూ. 150 నుంచి రూ. 200 వరకూ పలుకుతుండటంతో సామాన్యులు వంటల్లో ఈ కాయగూరను వేయడం మానేశారు.
Read More :