న్యూఢిల్లీ: సోనియా గాంధీ, రాహుల్, చిదంబరం, రాబర్ట్ వాద్రా వంటి వ్యక్తుల ప్రమేయం ఉన్న హైప్రొఫైల్ కేసుల ప్రాసిక్యూషన్లో జాప్యం బీజేపీ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. 2014 నుంచి అవినీతి అంశంపై పోరాటమే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారాస్త్రంగా ముందుకొచ్చిన విషయాన్ని ప్రధానికి రాసిన లేఖలో ఆయన ప్రస్తావించారు.
యూపీఏ హయాంలో వెలుగుచూసిన పలు అవినీతి కేసుల ప్రాసిక్యూషన్ నత్తనడకన సాగుతున్నదని పేర్కొన్నారు. 2జీ స్కామ్ నుంచి చిదంబరం ఆయన కుమారుల ప్రమేయం ఉన్న ఎయిర్సెల్-మ్యాక్సిస్, సోనియా, రాహుల్ గాంధీలు బెయిల్పై ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, రాబర్ట్ వాద్రా కేసు వరకూ వివిధ కేసుల విచారణ వేగవంతం కాలేదని ఆందోళన వ్యక్తంచేశారు. పలు జాతీయ, స్ధానిక ఎన్నికల్లో అవినీతి చుట్టూ ఎన్నికల ప్రచారం సాగించిన బీజేపీకి ఆయా కేసుల దర్యాప్తు నత్తేనడకన సాగడం ఎదురుదెబ్బలా పరిణమిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.