న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి కలిశారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆమెతో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అధికార నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. దీంతో సుబ్రమణ్యస్వామి టీఎంసీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ఆమె (మమత)తో ఉన్నాను. నేను ఆ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. మమతతో భేటీకి ముందు బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంఖర్ను సుబ్రమణ్యస్వామి కోల్కతాలో మంగళవారం కలిశారు.
గత నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన స్వామి, గతంలో చాలా సందర్భాలలో టీఎంసీ అధినేత్రి మమతను ప్రశంసించారు. అక్టోబర్లో జరిగిన ప్రపంచ శాంతి సదస్సు కోసం రోమ్కు వెళ్లేందుకు మమతకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన విమర్శలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు నందిగ్రామ్లో ప్రచారం చేస్తున్న మమత కాలికి గాయమైన తర్వాత ఆమెకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఘటన నాడు టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
2020లో మమత రాజకీయాలపై వచ్చిన ఒక ట్వీట్కు స్వామి స్పందించారు. ‘నా ప్రకారం మమతా బెనర్జీ పక్కా హిందువు, దుర్గా భక్తురాలు. ఒక్కో కేసు ఆధారంగా ఆమె పని చేస్తుంది. ఆమె రాజకీయం వేరు. మనం దానిపై మైదానంలో పోరాడుదాం’ అని ట్విట్టర్లో బదులిచ్చారు.
.