న్యూఢిల్లీ : భారత పోలీస్ బలగాల్లో మహిళల సంఖ్య కేవలం 10.5 శాతం కాగా, ప్రతి మూడు పోలీస్ స్టేషన్లకు గాను కేవలం ఒక పోలీస్ స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఇండియన్ జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) అధ్యయనంలో వెల్లడైంది. జనవరి 2021 నాటికి దేశంలోని 41 శాతం పోలీస్ స్టేషన్లలో ఇంకా మహిళా హెల్ప్ డెస్క్లు లేవని తెలిపింది.
ఇక కేవలం 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే అన్ని జిల్లాల్లో సైబర్ సెల్లు ఉన్నాయని వెల్లడైంది. పలు సంస్ధలు సమిష్టిగా ఒక గొడుగు కిందకు వచ్చి ఇండియా జస్టిస్ రిపోర్ట్ను ముందుకు తెచ్చారు. ఈ నివేదిక గణాంకాల ప్రకారం పోలీసు బలగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ ఉన్నా మొత్తం పోలీసుల్లో మహిళల శాతం కేవలం 10.5 శాతమే ఉందని తేలింది.
పోలీసు బలగాల్లో మహిళల నియామకం ఇదే తరహాలో కొనసాగితే 33 శాతం రిజర్వేషన్ లక్ష్యాన్ని చేరేందుకు 33 సంవత్సరాలు పడుతుందని నివేదిక పెదవివిరిచింది. ఇక దేశవ్యాప్తంగా 17,233 పోలీస్ స్టేషన్లలో ప్రతి మూడు పోలీస్ స్టేషన్లలో కేవలం ఒక స్టేషన్లోనే సీసీటీవీ కెమెరాలున్నాయని ఐజేఆర్ నివేదిక పేర్కొంది.