న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గుముఖం పడుతున్నా.. సర్వత్రా థర్డ్ వేవ్పై భయాందోళనలు నెలకొన్నాయి. మరో 18 సంవత్సరాలకు పైబడిన వారికి టీకాల పంపిణీ కొనసాగుతున్నది. పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చినా ఇంకా జాతీయ కొవిడ్ టీకాల కార్యక్రమంలో చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ క్రమంలో పిల్లలకు టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే విషయంపై అధ్యయనం నిర్వహించగా.. షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. కేవలం 33.5శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే టీకాలు వేసేందుకు అంగీకరిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేను పీజీమర్ (చండీగఢ్), జిప్మార్ (పుదుచ్చేరి) పరిశోధకులు ఆన్లైన్లో నిర్వహించగా.. దీని ఆధారంగా ప్రీ-ప్రింట్ అధ్యయనం జరిగింది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే టీకాలు వేయించకపోవడానికి ప్రధాన కారణాలు భద్రత, ప్రభావం, దుష్ఫ్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత, ప్రభావంపై 86.4శాతం మంది, దుష్ప్రభావాలపై 78.2శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవంగా పిల్లలకు స్వల్ప అనారోగ్యం 52.8శాతం మాత్రమే. నిపుణులు ప్రీ-ప్రింట్ అధ్యయనాన్ని మెడికల్ రీసెర్చ్ సర్వర్ మెడ్రెగ్జివ్ (MedRxiv)లో అప్లోడ్ చేశారు. పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. పిల్లల భద్రతను, ఎడ్యుకేషన్ను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
టీకా భద్రతపై తల్లిదండ్రులు ఓ అవగాహనకు వచ్చి.. వ్యాక్సిన్ వేసేందుకు నిరాసక్తి చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. వేగంగా టీకాల అభివృద్ధి, టీకాలతో తెలియని దీర్ఘకాలిక దుష్ప్రభావాలు పిల్లలపై ప్రభావాన్ని చూపుతాయని ఆందోళనకు గురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, తల్లిదండ్రుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడంలో వైద్యులు కీలకపాత్ర పోషిస్తారని అధ్యయనం తెలిపింది.
దేశంలో ఇప్పటి వరకు 12-18 సంవత్సరాల వయసున్న పిల్లల కోసం జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్-డీ వ్యాక్సిన్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. మరో వైపు 2-18 సంవత్సరాల పిల్లల కోసం దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను సైతం నిపుణుల కమిటీ ఆమోదించింది. మరో వైపు డీసీజీఐ ఆమోదించిన జైకోవ్-డీ వ్యాక్సిన్ను ఇంకా జాతీయ టీకాల పంపిణీ కార్యక్రమంలో చేర్చలేదు. మరో వైపు కొవాగ్జిన్ వాడకాన్ని యూఎస్ ఎఫ్డీఏ ఆమోదించలేదు.
ఆన్లైన్ సర్వే ఆధారిత అధ్యయనం టీకాపై తల్లిదండ్రులు భయపడుతున్నట్లు చూపిస్తున్నది. కొవిడ్తో పిల్లల్లో తేలికపాటి లక్షణాలు ఉండడంతో పాటు తక్కువ మరణాల రేటు ఉంటుంది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-కళ్యాణిలోని కమ్యూనిటీ మెడిసన్ విభాగం వైద్యుడు డాక్టర్ రితేశ్ సింగ్ మాట్లాడుతూ ఒక్క మరణాన్ని నివారించేందుకు వ్యాక్సిన్లను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.