ముంబై: ఆన్లైన్ క్లాస్ కోసం ఆ గ్రామ విద్యార్థులు ఒక చెట్టు ఎక్కుతున్నారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడమే దీనికి కారణం. కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్త్నుది. అయితే మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోండియా జిల్లాలోని మూరుమూల గ్రామానికి చెందిన విద్యార్థులు మొబైల్ సిగ్నల్ కోసం గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టు వద్దకు చేరుతున్నారు. ఆ చెట్టు ఎక్కి తమ మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ క్లాసులు వింటున్నారు. మొబైల్ టవర్కు 200 మీటర్ల ఉన్న ఈ చెట్టును నెట్వర్క్ ట్రీగా వారు పిలుస్తారు.
గత 15 నెలల్లో సుమారు 150 మంది గ్రామీణ విద్యార్థులు నోటు పుస్తకాలు, పెన్నులు, మొబైల్ ఫోన్లతో ఈ చెట్టు వద్దకు వచ్చి ఆన్లైన్ క్లాసులు విన్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన మరికొందరు విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల కోసం ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న దూరంలోని మరో గ్రామానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. వర్షా కాలంలో ఆన్లైన్ క్లాసులు కోసం గ్రామీణ విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.