PHD | న్యూఢిల్లీ, మార్చి 28: పీహెచ్డీ అడ్మిషన్లకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) స్కోర్ ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయించింది. 2024-25 నుంచే దీన్ని అమలుచేయాలని అన్ని విశ్వవిద్యాలయాలకు సూచించింది.
2024 జూన్ సెషన్కు సంబంధించి వచ్చే వారం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించేందుకు ఎన్టీఏ కసరత్తు చేస్తున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీశ్కుమార్ ట్వీట్ చేశారు. ఏడాదికి రెండు సార్లు జూన్, డిసెంబర్లో నెట్ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది. ప్రస్తుతం జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) ప్రదానానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకానికి నెట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నెట్ స్కోర్ను పీహెచ్డీ అడ్మిషన్లకు కూడా పరిగణనలోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.