న్యూఢిల్లీ, అక్టోబర్ 8: విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకూడదనే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని, వీటికి హాజరుకావటం తప్పనిసరి కాదని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బోర్డు పరీక్షలు ఒకేసారి నిర్వహించటం వల్ల విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేశామన్నారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కొత్త పరీక్షల విధానాన్ని 2024 నుంచి అమల్లోకి తెస్తామన్నారు. రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యపై మాట్లాడుతూ, ‘ఇది చాలా సున్నితమైన అంశం.విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడకుండా చేయటం మనందరి బాధ్యత’ అని అన్నారు. వివిధ రాష్ర్టాల్లో వెలుస్తున్న ‘డమ్మీ స్కూల్స్’పై సీరియస్గా చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ‘డమ్మీ స్కూల్స్’ ఫుల్టైం క్లాసులు నిర్వహించటం లేదు. అందులో చేరిన విద్యార్థుల్ని నీట్, జీఈఈ కోచింగ్ కోసం రాజస్థాన్లోని ‘కోటా’కు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటున్నదని, కోచింగ్ సెంటర్లలో సరైన మార్కులు రాకపోయేసరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.