న్యూఢిల్లీ, జూలై 15: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు(సీయూఈటీ) ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమైంది. ఈ పరీక్షపై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. సీయూఈటీ ప్రకటన చేసినప్పటి నుంచి వివాదాల్లో మునుగుతూనే ఉన్నది. తాజాగా నిర్వహణ లోపాల కారణంగా శుక్రవారం అనేక మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేని పరిస్థితి నెలకొన్నది. చివరి నిమిషంలో పరీక్ష కేంద్రాల మార్పుతో పలువురు పరీక్ష రాయలేక కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం జరిగిన రెండు స్లాట్ల పరీక్షల్లో విద్యార్థులకు ఉదయం ఒక నగరంలో, మధ్యాహ్నం మరో నగరంలో కేంద్రం కేటాయించడం నిర్వహణ లోపాన్ని చూపెడుతున్నది. అంతకుముందు తొలి విడత పరీక్షకు కేవలం మూడు రోజుల ముందు అడ్మిట్కార్డులు విడుదల చేయడం, పరీక్షల తేదీల్లో మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయి.
రెండో అతిపెద్ద ప్రవేశ పరీక్ష..
సీయూఈటీ పరీక్షకు 14.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నీట్-యూజీ( 18 లక్షలు) తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద ప్రవేశ పరీక్ష ఇదే కావడం గమనార్హం. సమాచారం లేకుండా చివరి నిమిషంలో పరీక్ష కేంద్రాలు మార్చడం వలన అనేక మందిని ఎగ్జామ్ మిస్సయ్యేలా చేసింది. 18 ఏండ్ల అంచల్ అనే విద్యార్థినికి ముందుగా ఢిల్లీ శివారు ప్రాంతంలో ఓ సెంటర్ ఇచ్చారు. అక్కడకు వెళితే అధికారులు లోపలికి అనుమతించలేదు. నీ సెంటర్ నార్త్ క్యాంపస్ అని చెప్పడంతో అక్కడకు వెళ్లగా.. పరీక్ష మొదలైపోయిందని చెప్పారు. రితిక విద్యార్థినికి కూడా ఇదే పరిస్థితి.
సుదూరంగా పరీక్ష కేంద్రాలు..
ఎంచుకున్న కేంద్రాలు కాకుండా సుదూరమైన సెంటర్లు ఇచ్చారని కమ్య అనే విద్యార్థిని వాపోయారు. అస్సాంకు చెందిన కిరణ్జ్యోతి చమ్కా అనే విద్యార్థికి ఉదయం స్లాట్ ఎగ్జామ్ గువాహటి, మధ్యాహ్నం స్లాట్ పరీక్ష సిల్చార్లోని కేంద్రాల్లో కేటాయించారు. పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి, పంజాబ్లోని పఠాన్కోట్లోని రెండు పరీక్ష కేంద్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా పరీక్ష రద్దు చేశారు. ఈ విద్యార్థులతో పాటు పరీక్ష కేంద్రాల మార్పుల వలన పరీక్ష మిస్సయిన వారికి రెండో విడతలో చాన్స్ ఇస్తామని ఎన్టీఏ అధికారులు పేర్కొన్నారని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే మిస్సయిన వారికి రీటెస్టు నిర్వహించబోమని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ప్రకటించారు.
వస్తున్న విమర్శలు ఇవీ..