న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో లోపాలపై విద్యార్థుల నిరసనతో జంతర్ మంతర్ వద్ద మొదలైన జెన్జీ ఉద్యమం ఇప్పుడు మారుమూల గ్రామాల వరకు పాకింది. పట్టణాల నుంచి గ్రామాల వరకు జెన్జీ నుంచి జెన్ ఆల్ఫా వరకు నిరసన స్వరాలు అంతకంతకూ బలపడుతున్నాయి. నీట్ పరీక్షల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై జూన్-జూలైలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలో జరిగిన ఆందోళనల అనంతరం ఇప్పుడు వందలాది మంది పాఠశాల విద్యార్థులు తమ సమస్యలను ఎత్తిచూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు, మరుగుదొడ్లు లేవు, ఉపాధ్యాయులు లేరు, మౌలిక సదుపాయాలు లేవు, చివరకు సరైన పాఠశాల భవనం కూడా లేదనే సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. దేశ సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో జెన్ ఆల్ఫా విద్యార్థులు(2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారు) తమ విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి ఇలాంటి వార్తలు వెలువడ్డాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా విద్యార్థులు తమ గొంతును వినిపిస్తూ, తక్షణ పరిష్కారం కోసం నినదిస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈనెల 21న 36 జిల్లాలకు చెందిన జెన్ ఆల్ఫా, జెన్ జీ విద్యార్థులు, ఉపాధ్యాయులు శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ స్కూల్స్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే నిరవధిక ధర్నా చేపడతామని వారు హెచ్చరించారు.
ఉత్తర్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఫతేపూర్, హమీర్పూర్, కన్నౌజ్ తదితర నగరాల్లో ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను విద్యార్థులు దిగ్బంధించారు. నిపుణులైన ఉపాధ్యాయుల కొరతకు నిరసనగా ఈనెల 14న లక్నోలోని జైప్రకాశ్ నారాయణ్ సర్వోదయ విద్యాలయ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈనెల 19న ఉన్నావ్లోని ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన వందలాది విద్యార్థులు నాసిరకం ఆహారం, పరిశుభ్రమైన నీరు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. కిషన్పూర్లోని సర్వదయ ఇంటర్ కాలేజీ విద్యార్థులు కనీస మౌలిక సదుపాయాల కోసం జూలై 28న ఆందోళన నిర్వహించారు.