హిజబ్ వివాదం నానుతుండగానే.. షిమోగాలో మరో కొత్త వివాదం రాజుకుంది. షిమోగాలోని ఓ కాలేజీలో ఓ విద్యార్థి త్రివర్ణపతాకం ఎగరేసే స్తంభం పైకి ఎక్కి, కాషాయ జెండాను ఎగరేశాడు. త్రివర్ణ పతాకం స్థానంలో ఆ విద్యార్థి కాషాయజెండాను ఎగరేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక అక్కడున్న విద్యార్థుల చేతుల్లో కూడా కాషాయ జెండాలు కనిపించాయి. అయితే ఇందుకు మునుపే షిమోగాలో వివాదం రాజుకుంది. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమై… 144సెక్షన్ విధించారు.
ఓ వారం మూసేయండి : డీకే శివకుమార్
ఈ వివాదంపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. ఇలాంటి వివాదాలు, ఘటనలు జరిగే విద్యా సంస్థలను ఓ వారం పాటు మూసేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా మూసేసి, ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. కర్నాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో పరిస్థితులు చేయిదాటాయని, త్రివర్ణ పతాకం స్థానే కాషాయ జెండాను ఎగరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.