Umar Khalid | రెండేండ్ల క్రితం జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖలీద్తో పాటు యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ (యూఏహెచ్) సభ్యుడు ఖలీద్ సైఫీని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి పులస్త్య ప్రమాచల శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఫిబ్రవరి నాటి అల్లర్లలో 53 మంది చనిపోగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.
ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీపై 2020 ఫిబ్రవరిలో ఖజూరీ ఖాస్ పోలీస్ స్టేషన్లో కేసు దాఖలైంది. సెప్టెంబర్ 13 న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
కాగా, అక్టోబర్ 18న ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో ఉమర్ ఖలీద్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, జేఎన్యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగనా కలిత, జామియా సమన్వయ కమిటీ సభ్యులు సఫూరా జర్గర్, ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు పలువురిపై ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసులు నమోదయ్యాయి.