Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బిహార్లో జేడీ(యూ)-బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగలేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ఈ కూటమి 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకూ నిలవబోదని తేల్చిచెప్పారు.
జేడీ(యూ)-బీజేపీ ప్రభుత్వం ఏడాది అంతకంటే తక్కువ కాలమే అధికారంలో ఉంటుందని అన్నారు. ఈ విషయం తాను రాసిస్తానని ప్రశాంత్ కిషోర్ చెప్పకొచ్చారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత మార్పు జరుగుతుందని అన్నారు. ఇక నితీష్ కుమార్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు బిహార్ సీఎంగా తొమ్మిదో సారి ప్రమాణ స్వీకారం చేశారు.
నితీష్తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హాతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో పరిస్ధితులు సవ్యంగా లేనందునే తాను కూటమి నుంచి వైదొలగుతున్నానని నితీష్ కుమార్ చెప్పుకొచ్చారు. పార్టీ కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరి సలహాలకు అనుగుణంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం నితీష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.
Read More :