Clash in JNU | దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఆదివారం శ్రీరామ నవమి సాక్షిగా రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. శ్రీరామ నవమి సందర్భంగా హాస్టల్ నాన్వెజ్ కర్రీ వడ్డించడాన్ని ఒక గ్రూప్ అడ్డుకోగా.. మరో గ్రూప్ ప్రశ్నించడంతో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు కావేరి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు వచ్చి హాస్టల్ మెస్ కార్యదర్శిపై దాడి చేశారని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ఆరోపించింది. విద్యార్థులకు మటన్ కర్రీ వడ్డించకుండా సిబ్బందిని అడ్డుకున్నారని తెలిపింది.
జేఎన్యూఎస్యూ ఆరోపణను బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ అనుబంధ ఏబీవీపీ ఖండించింది. హాస్టల్లో శ్రీరామ నవమి సందర్భంగా పూజ నిర్వహిస్తుండగా, వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు అడ్డుకున్నారని ఎదురుదాడికి దిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో వారికి గాయాలయ్యాయి.
యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించారు. ఢిల్లీ డీసీపీ (నైరుతి) మనోజ్ సీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు క్యాంపస్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఎటువంటి హింస లేదని మనోజ్ సీ చెప్పారు. యూనివర్సిటీ అధికారుల విజ్ఞప్తి మేరకు హాస్టల్కు వచ్చామని.. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఏబీవీపీ అధికార బలంతో గూండాయిజానికి పాల్పడుతున్నదని జేఎన్యూఎస్యూ ఆరోపించింది. వారు బలవంతంగా మెస్ కమిటీ సభ్యులపై దాడి చేశారని తెలిపింది. నాన్ వెజిటేరియన్ కర్రీలు లేకుండా విద్యార్థులందరికీ డిన్నర్ మెనూ మార్చాలని డిమాండ్ చేశారని ఓ ప్రకటనలో తెలిపింది. జేఎన్యూ, యూనివర్సిటీ హాస్టళ్లు ఏ ఒక్క సెక్షన్కు మాత్రమే చెందింది కాదని, అన్ని వర్గాలకు చోటు ఉంటుందని స్పష్టం చేసింది.
జేఎన్యూఎస్యూ ఆరోపణలను ఏబీవీపీ తిరస్కరించింది. శ్రీరామ నవమి సందర్భంగా కొందరు విద్యార్థులు కావేరి హాస్టల్లో 3.30 గంటలకు పూజ కార్యక్రమం చేపట్టారని తెలిపింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పూజలో పాల్గొనడంతో వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు అభ్యంతరం తెలిపారని ఎదురు దాడికి దిగింది. పూజలు నిర్వహించకుండా అడ్డుకున్నారని పేర్కొంది. కానీ వారు రైట్ టు ఫుడ్ (నాన్ వెజిటేరియన్ ఫుడ్) అంశాన్ని కావాలని లేవనెత్తుతున్నారని ఆరోపించింది.