న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సొంత పార్టీ మంత్రిపై మండిపడ్డారు. మీ ప్రసంగం ముగించండి అంటూ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని సూరజ్కుండ్లో అమిత్ షా అధ్యక్షతన అంతర్గత భద్రతా సమావేశం గురువారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే చింతన్ శిబిరానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ సుమారు 8 నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయనకు కేటాయించిన ఐదు నిమిషాల సమయం ముగియడంతో అమిత్ షా అసహనం వ్యక్తం చేశారు. ప్రసంగాన్ని ముంగించాలంటూ బీజేపీ మంత్రి అనిల్ విజ్కు పదే పదే చెప్పారు. ‘అనిల్ జీ, క్లుప్తంగా చెప్పాలి. ఇది స్వాగత ప్రసంగం. ఐదు నిమిషాలు కేటాయించారు, కానీ ఇప్పటికే ఎనిమిదిన్నర నిమిషాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరికీ స్వాగతం పలికి ముగించండి. తద్వారా కార్యక్రమం కొనసాగుతుంది’ అని తొలిసారి అన్నారు.
కాగా, హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తన స్వాగత ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో అమిత్ షా రెండోసారి జోక్యం చేసుకున్నారు. ‘అనిల్ జీ, మీ ప్రసంగాన్ని ముగించండి. సమయం తక్కువగా ఉంది’ అని అన్నారు. అయినప్పటికీ బీజేపీ మంత్రి అనిల్ విజ్ తన స్వాగత ప్రసంగాన్ని ముగించలేదు. దీంతో ‘ఇక సమావేశాన్ని కొనసాగిద్దాం’ అని అమిత్ షా మూడోసారి అన్నారు. నాలుగోసారి మంత్రి అనిల్ విజ్పై మరింత అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.