ముంబై: త్రిపుర హింసపై మహారాష్ట్రలో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులతో సహా 18 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. త్రిపురలో మత హింసను వ్యతిరేకిస్తూ శుక్రవారం కొన్ని ముస్లిం సంస్థలు మహారాష్ట్రలోని పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. ముంబైలోని భేండీ బజార్, మహ్మద్ అలీ రోడ్, కుర్లాతో పాటు థానేలోని ముంబ్రా, భివాండితో సహా ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో షాపులు మూసివేశారు.
మైనారిటీ కమ్యూనిటీపై అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అమరావతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలుపల ఎనిమిది వేల మందికిపైగా ముస్లింలు గుమిగూడారు. అధికారికి మెమోరాండం సమర్పించారు. అనంతరం వారు తిరిగి వెళ్తుండగా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్ర చౌక్, కాటన్ మార్కెట్ మధ్య మూడు చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
అమరావతితోపాటు మాలేగావ్, నాందేడ్, మరి కొన్ని చోట్ల ఆందోళనకారులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు. మాలేగావ్లో ముగ్గురు అధికారులతోపాటు పది మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. నాందేడ్లో జరిగిన రాళ్ల దాడుల్లో ఎనిమిది మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులు నాలుగు పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి మహారాష్ట్రలో 20 కేసులు నమోదు చేశారు.
కాగా, ఈ ఘటనలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు శనివారం బంద్కు పిలుపునిచ్చారు. అయితే అమరావతిలో బలవంతంగా షాపులు మూయిస్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించడంతోపాటు అమరావతిలో 144 సెక్షన్ విధించారు.
మరోవైపు పరిస్థితి అదుపులోనే ఉన్నదని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు. శాంతిని, సామాజిక సామరస్యాన్ని కాపాడాలని హిందూ, ముస్లిం సంస్థలకు పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా సహనంతో వ్యవహరించాలని సూచించారు.