Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. బీహార్లోని కతిహార్ జిల్లాలో గల బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. రైలు దల్కోలా-టెల్టా స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు రైలుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే, ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దాడి సమాచారం అందుకున్న బలరాంపూర్ పోలీసులు, రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
కాగా, గతేడాది డిసెంబరు 30న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్లోని హౌరా- న్యూ జల్పైగురి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆ తర్వాత మూడు రోజులకే రైలుపై రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఈ నెలలో సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్కు వెళ్తున్న రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలోనూ కిటీకి అద్దాలు దెబ్బతిన్నాయి. వందేభారత్ రైళ్లపై జరుగుతున్న వరుస రాళ్ల దాడులు అధికారులను కలవరపెడుతున్నాయి.