పుణె/బెళగావి, డిసెంబర్ 6: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతున్నది. రెండు రాష్ర్టాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం మహారాష్ట్రకు చెందిన ట్రక్కులపై కర్ణాటకలో దాడులు.. మహారాష్ట్రలో కర్ణాటక ప్రభుత్వ బస్సులపై ‘జై మహారాష్ట్ర’ అంటూ నినాదాలతో పెయింటింగ్ రాతలు ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న కర్ణాటకలోని బెళగావికి వస్తామని మహారాష్ట్ర మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో.. కర్ణాటక రక్షణ వేదిక మంగళవారం పట్టణంలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ఉన్న ఐదు ట్రక్కులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు.
వాహనాలపై నల్ల ఇంకు చల్లి నంబర్ ప్లేట్లను పీకేశారు. ట్రక్కులతో పాటు పోలీసు వాహనాలపైకి కూడా ఎక్కి మహారాష్ట్ర రాజకీయ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ్ గౌడతో పాటు వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మరోవైపు మహారాష్ట్రలోని పుణెలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) కార్యకర్తలు మూడు కర్ణాటక ప్రభుత్వ బస్సులపై నలుపు రంగు చల్లడంతో పాటు నలుపు, కాషాయ రంగుల్లో ‘జై మహారాష్ట్ర’ అని నినాదాలు రాశారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
మహారాష్ట్ర మంత్రుల పర్యటన వాయిదా
బెళగావి పర్యటనను వాయిదా వేసుకొంటున్నట్టు మహారాష్ట్ర మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్ ప్రకటించారు. ఇది వాయిదా మాత్రమేనని, అంబేద్కర్ వర్ధంతి రోజున తాము ఎటువంటి సమస్యలను సృష్టించాలనుకోవడం లేదని పేర్కొన్నారు. తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్పవార్ స్పందిస్తూ.. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ఏం జరుగుతున్నదో తెలుసుకొన్న తర్వాత.. ఓ స్టాండ్ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పరిస్థితులను వేరే మార్గంలో తీసుకెళ్లేందుకు కర్ణాటక సీఎం బొమ్మై కొన్ని వారాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అటు.. సరిహద్దు వివాదంపై న్యాయపోరాటంలో తమదే అంతిమ విజయమని కర్ణాటక సీఎం బొమ్మై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పునరుద్ధాటించారు. ఉద్రిక్తతలకు మహారాష్ట్ర ప్రభుత్వమే కారణమని, రాష్ట్ర సరిహద్దు, ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
కర్ణాటకలోకి వస్తున్న వాహనాలపై రాళ్లదాడి
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు మహారాష్ట్ర ఆర్టీసీ కర్ణాటకకు వెళ్లే బస్సు సర్వీసులను మంగళవారం మధ్యాహ్నం నుంచి రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతతో పాటు ఆర్టీసీ ఆస్తులకు నష్టం కలుగకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకొన్నట్టు ఎంఎస్ఆర్టీసీ వైస్చైర్మన్, ఎండీ శేఖర్ చన్నే తెలిపారు. అయితే ఈ రద్దు ఎప్పటి వరకు అమ ల్లో ఉంటుందనే దానిపై స్పష్టత లేదు. మహారాష్ట్ర వైపు నుంచి కర్ణాటకలోకి ప్రవేశిస్తున్న మహారాష్ట్రకు చెందిన వాహనాలపై బెళగావి జిల్లాలోని హిరేబౌగ్వాడి టోల్గేట్ వద్ద కొంతమంది రాళ్లు విసిరినట్టు చూపించే వీడియో ఒకటి బయటకు రావడం సర్వీసుల రద్దుకు కారణంగా కనిపిస్తున్నది. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కర్ణాటక సీఎం బొమ్మైకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.