PM Modi | న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టాలను ఆర్థిక పరమైన అంశాలతోపాటు పలు విధాలుగా వేధింపులకు గురిచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చేసేందుకు, రాష్ర్టాల అధికారాల్లో చొరబడేందుకు పావులు కదుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బహుళ స్థాయి ఆపరేషన్ను మోదీ సర్కార్ రూపొందించి, ప్రారంభించిందని చెబుతున్నారు. వ్యవసాయం, విద్య, సహకార వ్యవస్థ, నీరు, వైద్యం, గ్రంథాలయాలు, క్రీడలు తదితర అంశాల్లో రాష్ర్టాల అధికారాలకు కత్తెర వేసేలా మోదీ సర్కారు అడుగులు వేస్తున్నదని విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీ సర్వీసెస్ చట్టమే తాజా ఉదాహరణ
రాష్ర్టాల అధికారాల్లో కేంద్ర ప్రభుత్వ చొరబాటు యత్నానికి ఢిల్లీ సర్వీసెస్ చట్టమే తాజా ఉదాహరణ. అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను ఈ బిల్లు ద్వారా కేంద్రం లాక్కొన్నది. పాలనాధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా.. మోదీ సర్కార్ ఆర్డినెన్స్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
రాష్ర్టాల సమ్మతితో పని లేకుండా..
ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది మొదట్లో ఐఏఎస్ క్యాడర్ రూల్స్ను సవరిస్తూ ప్రతిపాదనలు చేసింది. రాష్ర్టాల సమ్మతితో పని లేకుండా ఐఏఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్పై తీసుకోవచ్చనేది దాని ప్రధాన సారాంశం. కేంద్రానికి ఇలాంటి విస్తృత అధికారాలు లభిస్తే, సీనియర్ బ్యూరోక్రసీ విధేయత, సమ్మతి విషయంలో సంక్షోభం వస్తుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ర్టాల ముఖ్యమంత్రులు లేఖలు రాశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని కూడా బీజేపీ సర్కార్ బలవంతంగా రాష్ర్టాలపై రుద్దే ప్రయత్నం చేయగా.. ఒప్పందంపై 14 రాష్ర్టాల సీఎంలు సంతకాలు చేయలేదు.
ఆయుధంగా ఉమ్మడి జాబితా
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాను మరో ఆయుధంగా చేసుకొంటున్నది. కేంద్రం సొంతంగా సహకార చట్టాన్ని ఆమోదించుకోవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ చర్యను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఖండించారు. సహకార వ్యవస్థలో జోక్యం చేసుకొని, దాన్ని నాశనం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకొన్నదని ఎల్డీఎఫ్ నేతలు ఆరోపించారు. రాష్ర్టాల జాబితాలోని లైబ్రరీలను ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చి, గ్రంథాలయాలను కూడా కాషాయీకరణ చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నదనే వార్తలు కూడా వచ్చాయి.